మందు కోసం మర్డర్​..యువకుడిని పొడిచి చంపిన మైనర్​

మందు కోసం మర్డర్​..యువకుడిని పొడిచి చంపిన మైనర్​
  •  హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు

మాదాపూర్, వెలుగు: లిక్కర్​బాటిల్​అడిగితే ఇవ్వనందుకు కోపోద్రిక్తులైన ఇద్దరు మైనర్లు, ఓ యువకుడు కలిసి మరో యువకుడిని చంపేశారు. మద్యం మత్తులో మైనర్​ కత్తితో పొడిచి ఈ దారుణానికి పాల్పడ్డాడు. హత్య కేసులో ఇద్దరు మైనర్లతో పాటు యువకుడిని మాదాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. 

మాదాపూర్​ఇన్​స్పెక్టర్​ కృష్ణ మోహన్​ వివరాల ప్రకారం.. మణికొండ ప్రాంతానికి చెందిన  సురేశ్, లక్ష్మి దంపతుల కొడుకు జయంత్​గౌడ్​(18) పదో తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. గత నెల 30న తల్లి బర్త్​డే కావడంతో ఫ్రెండ్స్​తో కలిసి ఇంట్లో కేక్​ కట్​చేశాడు. 

అనంతరం ఫ్రెండ్స్​తో కలిసి బైక్ పై బయటికి వెళ్లాడు. ఖానామేట్​యశోద ఆసుపత్రి వెనుక నిర్మానుష్య ప్రాంతంలో 8 మంది స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ఎర్రగడ్డకు చెందిన ఈశ్వర్​సింగ్, మరో ఇద్దరు మైనర్​లు స్కూటీపై అక్కడికి వచ్చారు. జయంత్​గౌడ్  వద్దకు వచ్చి తమకు లిక్కర్​ బాటిళ్లు ఇవ్వాలని గొడవ పెట్టుకున్నారు.

 ఈ గొడవలో ఓ మైనర్ తన వద్ద ఉన్న కత్తితో జయంత్​గౌడ్ పక్కటెముకలు, నడుము భాగంలో పొడిచి పరారయ్యాడు. బాధితుడిని హాస్పిటల్​కు తరలిస్తుండగా, మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్​ పోలీసులు ఈశ్వర్​సింగ్​తో పాటు ఇద్దరు మైనర్లను సోమవారం అరెస్ట్​ చేశారు. మైనర్లను జువైనల్​హోమ్​కు, ఈశ్వర్​సింగ్​ను రిమాండ్​కు తరలించారు. హత్య కేసులో పాల్గొన్న ఓ మైనర్​పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.