108 దేశాలు పోటీ పడగా... ఈమెనే మిస్ వరల్డ్ కిరీటం ఎలా వరించిందంటే..

108 దేశాలు పోటీ పడగా... ఈమెనే మిస్ వరల్డ్ కిరీటం ఎలా వరించిందంటే..
  • టాప్​ 20కే పరిమితమైన మిస్​ ఇండియా నందిని గుప్తా
  • హైదరాబాద్​ హైటెక్స్​లో అట్టహాసంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే
  • హాజరైన సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి, మెగాస్టార్​ చిరంజీవి
  • తరలివచ్చిన బాలీవుడ్​, టాలీవుడ్​ తారలు, వ్యాపారవేత్తలు 
  • సోనూసూద్​కు హ్యుమానిటేరియన్ అవార్డు

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​లోని హైటెక్స్​ వేదికగా శనివారం సాయంత్రం 72వ మిస్​ వరల్డ్​ గ్రాండ్​ ఫినాలే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయ్​లాండ్​ బ్యూటీ ఓపల్​ సుచాత చువాంగ్​శ్రీని వరించింది. ఆ దేశం నుంచి మిస్ ​వరల్డ్​గా ఎంపికైన తొలిమహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అతిథులు, అభిమానుల కేరింతల నడుమ సుచాతకు మిస్ వరల్డ్ –2024  క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. మొదటి రన్నరప్​గా మిస్​ ఇథియోపియా,  2వ రన్నరప్​గా మిస్ పోలాండ్,  3వ రన్నరప్​గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ ​ఇండియా నందిని గుప్తా టాప్​8లో చోటు దక్కించుకోలేకపోయారు. టాప్​ 20కే ఆమె పరిమితమయ్యారు.

మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాత.. రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నారు. 

108 దేశాలు పోటీ పడగా..!

మిస్ వరల్డ్ గ్రాండ్​ ఫినాలేకు సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్​, జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి, సినీ ప్రముఖులు చిరంజీవి, దిల్​ రాజుతో పాటు  బాలీవుడ్​, టాలీవుడ్​  తారలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. 20 రోజుల పాటు రాష్ట్రంలో జరిగిన మిస్​ వరల్డ్​ పోటీల్లో మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఈవెంట్ల వారీగా విజేతలను ప్రకటిస్తూ ఉండడంతో చివరికి కిరీటం ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది.  గ్రాండ్​ ఫినాలేలో అమెరికన్​ కరేబియన్​, ఆఫ్రికా, యూరప్​, ఆసియా ఖండాలవారీగా మొదట పది మంది చొప్పున 40 మంది కంటెస్టెంట్లు పోటీపడ్డారు. 

వారిలో నుంచి ఒక్కో ఖండం నుంచి (మొత్తం నాలుగు ఖండాలు) ఐదుగురి చొప్పున 20 మందిని సెలెక్ట్​ చేశారు. ఇక్కడ ఆసియా ఖండం నుంచి సెలెక్ట్​ అయిన ఐదుగురిలో మిస్​ ఇండియా నందిని గుప్తా కూడా ఉన్నారు. ఆ తర్వాత రౌండ్​లో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు సెలెక్ట్​  అయ్యారు. వీరిలో మిస్​ మార్టినిక్, మిస్​ బ్రెజిల్, మిస్​ ఇథియోపియా, మిస్​ నమీబియా, మిస్​ పోలెండ్, మిస్​ఉక్రెయిన్, మిస్​ ఫిలిప్పీన్స్, మిస్​ థాయిలాండ్ ఉన్నారు. వీరిలోంచి మిస్​ మార్టినిక్, మిస్​ ఇథియోపియా, మిస్​ పోలాండ్​, మిస్​ థాయ్​లాండ్ ​తుదిరౌండ్​కు వెళ్లగా..  మిస్​ వరల్డ్​గా మిస్ ​థాయ్​లాండ్​ సుందరి సుచాత నిలిచారు.  

గ్రాండ్​ ఫినాలేలో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ డాన్స్​ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. మిస్ వరల్డ్ –2016 స్టెఫానీ డెల్ వాలె, ఇండియన్​ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్ లుగా అలరించారు.  మిస్​ వరల్డ్​ గ్రాండ్​ ఫినాలేలో 8 మంది న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఇందులో స్పెషల్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్ రంజన్, మిస్​ వరల్డ్​ సీఈవో జూలియా మోర్లీ పాల్గొన్నారు.  

సోనూసూద్​కు మానవతావాది అవార్డు 

మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును సినీ నటుడు సోనూ సూద్ అందుకున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. సినీ నటుడు రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ జ్ఞాపిక అందుకున్నారు. 

మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా సుధారెడ్డి 

మిస్​ వరల్డ్​ గ్లోబల్​ అంబాసిడర్​ గా వ్యాపారవేత్త సుధారెడ్డి నియామకమయ్యారు. ఆమెకు జూలియా మోర్లీ జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. మిస్​ వరల్డ్​ గ్లోబల్​ అంబాసిడర్​ గా నియమించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈవెంట్​ కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.  తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

గ్రాండ్ సక్సెస్​: జూపల్లి

సీఎం రేవంత్ రెడ్డి చొరవ, దిశానిర్దేశంతో  మిస్ వరల్డ్ వేడుకలను ఘనంగా నిర్వహించామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ‘‘తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా  నిర్వహించిన మిస్ వరల్డ్ 2025  పోటీలు విజయవంతమయ్యాయి. అన్ని ప్రభుత్వ విభాగాలు సమగ్ర కార్యాచరణ, సమన్వయంతో నిర్విరామంగా కృషి చేయడంతో ఈ ఈవెంట్  గ్రాండ్ సక్సెస్ అయింది” అని ఆయన పేర్కొన్నారు. 

బ్యూటీ విత్​పర్పస్‌‌‌‌గా మిస్ ​ఇండోనేషియా..

మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్‌‌‌‌గా మిస్ ఇండోనేషియా ఎన్నికయ్యారు. పరిశుభ్రమైన నీరు అందరికీ అవసరమని, నీటి కాలుష్యంపై అవగాహన కల్పిస్తున్నందుకు మిస్ ఇండోనేషియాకు ఈ అవకాశం దక్కింది. కాగా, ఫైనల్‌‌‌‌కు చేరిన నలుగురు అందాల భామలను న్యాయనిర్ణేతలు పలు ప్రశ్నలు అడిగారు. వాళ్ల వ్యక్తిత్వం, తెలివితేటలు, సామాజిక అవగాహనపై ప్రశ్నలు వేశారు. ఆయా ప్రశ్నలకు కంటెస్టెంట్లు తమదైన శైలిలో సమాధానమిచ్చారు. 

ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది?

ఫైనల్‌‌‌‌లో సుచాతను సోనూసూద్ అడిగిన ప్రశ్న ఇదీ.. 

టాప్‌‌‌‌–4లో అమెరికా నుంచి మార్టినికాకు చెందిన ఆరెల్లె జావోచిమ్‌‌‌‌, యూరప్‌‌‌‌ నుంచి పోలాండ్‌‌‌‌కి చెందిన మజాలడ్జా, ఆఫ్రికా నుంచి ఇథియోపియాకు చెందిన హస్సెట్‌‌‌‌ డీరెజె అడ్మస్సు, ఆసియా నుంచి థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌కి చెందిన ఓపల్ సుచాత చువాంగ్‌‌‌‌ నిలిచారు. వీరిలో విజేతను డిసైడ్ చేసేందుకు న్యాయనిర్ణేతలు ఒక్కొక్కరిని ఒక్కో ప్రశ్న అడిగారు. ఇందులో భాగంగా ఓపల్‌‌‌‌ సుచాతను ‘ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది?’ అని సోనూసూద్ ప్రశ్నించారు. 

దానికి ఆమె బదులిస్తూ.. ‘‘నేను ఇక్కడ ఉండటం జీవితంలో లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. పర్యాటకులను ఆకర్షించడం బాధ్యత అని నేర్చుకున్నాను. ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండాలి. మన చుట్టూ ఉన్న వాళ్లకి మనం చేయగలిగే సాయం చేయాలి. అదే ఉత్తమమైన పని అని భావిస్తాను” అని జవాబిచ్చారు. సుచాతలోని ప్రాక్టికల్‌‌‌‌ నెస్‌‌‌‌, సేవాభావం, బాధ్యత, సాయం చేయాలనే గుణం వంటివి ఆమెని విన్నర్‌‌‌‌గా నిలిపాయి.

నెల పాటు సాగిన పోటీలు.. 

దాదాపు నెల రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. చారిత్రక ప్రదేశాల సందర్శన, మెడికల్ టూరిజం, స్పోర్ట్స్ మీట్, గాలా డిన్నర్‌‌‌‌ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. తెలంగాణ పర్యాటక ప్రాంతాలను ప్రమోట్​చేసింది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేను దాదాపు 150 దేశాల్లో లైవ్​టెలీకాస్ట్​చేశారు. అమెరికాలోని న్యూజెర్సీలో జంక్షన్ల వద్ద డిజిటల్​స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. 

ప్రత్యేక డ్రెస్సులో పిస్కోవా.. 

మిస్​వరల్డ్–2024 క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక డ్రెస్సులో మెరిసిపోయారు. బాలీవుడ్​నటులు​ఇషాన్​ఖట్టర్, జాక్వెలిన్​ఫెర్నాండేజ్ డాన్సులతో అలరించారు. ఇషాన్ కట్టర్ నాటునాటు పాటకు తన స్టెప్పులతో అదరగొట్టారు. అందాల భామలు ప్రత్యేకమైన డ్రెస్సులతో ర్యాంపు వాక్​చేసి ఆకట్టుకున్నారు. 

మన సంస్కృతి ప్రపంచానికి చాటాం: సీఎం రేవంత్ 

మిస్ వరల్ట్ కిరీటం దక్కించుకున్న సుచాత సహా వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచినోళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘‘పోటీలతో తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, విలువలు ప్రపంచానికి చాటాం. కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు తెలంగాణ రైజింగ్ దార్శనికతను చూపించాం’’ అని అన్నారు. 

‘తెలంగాణ జరూర్​ఆనా’..

తెలంగాణ జరూర్​ఆనా నినాదంతో మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లింది. ఆయా ప్రాంతాల చరిత్ర, విశిష్టతను వివరించి తెలంగాణ టూరిజంపై ప్రచారం చేయాలని కోరింది. 

బ్రెస్ట్ క్యాన్సర్​ను జయించి..!

ఓపల్​ సుచాత థాయ్​లాండ్​కు చెందిన ప్రముఖ మోడల్​. ఆమె 2003 సెప్టెంబర్​20న జన్మించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. ‘ఓపల్‌ ఫర్‌ హర్‌’ అనే నినాదంతో మిస్‌ వరల్డ్‌ పోటీల్లో దిగారు. రొమ్ము క్యాన్సర్​పై బాధిత మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని మిస్​వరల్డ్​ వేదికపై సుచాత ప్రకటించారు. 16 ఏండ్ల వయసులో ఆమె బ్రెస్ట్​ క్యాన్సర్​ బారినపడి కోలుకున్నారు. అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్​ బాధితులకు అండగా వివిధ కార్యక్రమాలు చేపడ్తున్నారు. వారికోసం నిధులు సేకరిస్తున్నారు.