సిద్దిపేట జిల్లాలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

సిద్దిపేట జిల్లాలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

సిద్దిపేట: జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. నారాయణరావుపేట మండల పరిధిలోని మాటేండ్ల గ్రామంలో చెరువులో చేపల వేటకు వెళ్ళి రాఘవపూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేశం గల్లంతయ్యాడు. వెంకటేశం అనే యువకుడు తన ముగ్గురి స్నేహితులతో కలిసి చిన్నకొడూర్ మండలం మాటిండ్ల గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లారు. వెంకటేశం చేపల వలతో బ్రిడ్జి పక్కన ఉన్న కాలువ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారీ పడిపోయాడు.

కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వెంకటేశ్ సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు కొట్టుకొని పోయినట్టు తెలిపారు. అతని మిత్రులు పోలీసులకు సమాచారం అందించడంతో, వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేష్‌కు ఒక కుమారుడు, భార్య గర్భవతిగా ఉంది. చీకటి పడే వరకు పోలీసులు గాలించినా అతని ఆచూకీ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.