యూఎన్: యునైటెడ్ నేషన్స్లో 'పేట్రియాటిక్ విజన్ (పీవీఏ)' సంస్థ ప్రధాన ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఉన్నత స్థాయి దౌత్యవేత్త మహమ్మద్ సఫా తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్పై న్యూక్లియర్ అటాక్ చేసేందుకు యునైటెడ్ నేషన్స్ లోని కొన్ని శక్తులు తెరవెనుక కుట్ర చేస్తున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఈ భయంకరమైన నిజాన్ని ప్రపంచానికి చెప్పడానికే తాను రిజైన్ చేస్తున్నానని సఫా వెల్లడించారు. సోమవారం ఎక్స్ వేదికగా తన రిజైన్ లెటర్ పోస్ట్ చేశారు.
"యుద్ధం కోసం పరితపించే వ్యక్తుల్లారా.. టెహ్రాన్ ఎడారి కాదు. ఇక్కడ కోటి మంది జనాభా ఉంది. ఇందులో సామాన్య ప్రజలు, కుటుంబాలు, చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నాయి. అలాంటి నగరంపై న్యూక్లియర్ అటాక్ చేయాలన్న యోచనే పెద్ద నేరం అవుతుంది. అణ్వాయుధాలు ప్రయోగిస్తే జరిగే వినాశనాన్ని ఊహించుకోండి. యూఎన్లోని కొందరు ఉన్నతాధికారులు ఒక శక్తిమంతమైన అంతర్జాతీయ లాబీ (ఇజ్రాయెల్, అమెరికా ప్రయోజనాల కోసం పనిచేసే వర్గం) కు లొంగిపోయారు. వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారే మానవాళికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరానికి సహకరిస్తున్నారు. ‘‘మానవాళికి వ్యతిరేకంగా జరిగే నేరానికి సాక్షిగా ఉండలేక రిజైన్ చేస్తున్నాను’’ అని సఫా వివరించారు.
