- ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్
హనుమకొండ, వెలుగు: టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలని ఐఎన్టీయూసీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్, తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ సతీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఈ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికులు సంస్థ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. విధి నిర్వహణలో కార్మికులు చనిపోతున్నా, న్యాయం జరగడం లేదన్నారు. ఏండ్ల తరబడి సేవలందిస్తున్న ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలన్నారు.
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఏప్రిల్ 2న వంటా వార్పు, 7న మహాధర్నా చేపడతామని, అయినా ప్రభుత్వం స్పందించకపోతే 8 నుంచి సమ్మెకు దిగుతామని తెలిపారు.
