- రాత్రి 10 గంటలకు ప్రచారం ఎందుకని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఫైర్
అచ్చం పేట, వెలుగు : తన ప్రచారానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అంతు చూస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో సోమవారం రాత్రి 9.45 గంటలకు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈ టైంలో ప్రచారం చేయడం ఏమిటంటూ వీడియో తీశారు. ఇది గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఫోన్లు గుంజుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే గువ్వల.. కాంగ్రెస్ వాళ్లు అతిగా చేస్తున్నారని, రేపటి నుంచి మీ అంతు చూస్తానని హెచ్చరించారు. అతిగా చేసేవారిని జీప్ ఎక్కించండి అని ఎస్ఐని ఆదేశించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బుచ్చయ్య, మశన్న, మహమూద్ ను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని ఊరి బయటకు తీసుకెళ్లి మీటింగ్ ముగిసిన తర్వాత వదిలిపెట్టినట్లు తెలిసింది. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.