
సికింద్రాబాద్, వెలుగు: హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీని మడతపెట్టి కొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చినవి 420 హామీలని ప్రజలకు అర్థమైందన్నారు. ఇది మాటల సర్కారు తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని బొందపెడతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భాషను జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే ప్రజలకు కరెంటు, నీటి కష్టాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ‘‘రైతుబంధు జమకాలేదు. ఫ్రీ బస్ జర్నీ వల్ల మహిళలు కొట్టుకునే పరిస్థితి తెచ్చారు. ఆరున్నర లక్షల ఆటోడ్రైవర్లను రోడ్డున పడేశారు. 1.57 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడం శోచనీయమని, ఆ మాట ఎన్నికల ముదు చెప్పితే అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు.