
- మోదీకి పదవీకాంక్ష పీక్స్కు చేరింది
- కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యిండు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్: బీజేపీ తాచుపాము లాంటిదని, తలలోనే కాదు తోకలోనూ ఆ పార్టీకి విషం ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రధాని మోదీకి పదవీకాంక్ష పీక్స్కు చేరిందని.. అధికారం కోసం దేశాన్ని ఖండాలుగా నరికే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. మోదీకి ఎన్నికల కమిషన్ అన్న కూడా లెక్కలేకుండా పోయిందన్నారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీలునెరవేర్చటంలో కేంద్రప్రభుత్వం విఫలమైందన్నారు.
కూనంనేని మీడియాతో మాట్లాడుతూ ‘ మోదీకి అధికార పిచ్చి పట్టింది. అందుకే 2047లో కూడా నేనే ప్రధానిని అంటున్నరు. చేసింది ఏమీ చెప్పలేక ముస్లిం రిజర్వేషన్ల సాకుతో ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది. రాజ్యాంగాన్ని మార్చమని మోదీ అంటుంటే.. ఆయన శిష్యులు మాత్రం మారుస్తామంటున్నరు. దేశంలో శ్రీరామనవమి కంటే ముందే రాముని అక్షంతలను పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కుర్చీ దిగిపోయి అదృష్టవంతుడయ్యారు. ఆయన పాపాలు ఇప్పటి ప్రభుత్వం మోస్తోంది. కొత్త ప్రభుత్వానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సంక్షేమం నుంచి బయట పడాలంటే.. అఖిలపక్షం మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వరికి 500 బోనస్.. సన్న బియ్యంకే కాదు అన్ని బియ్యాలకు ఇవ్వాలి’ అని కూనంనేని డిమాండ్ చేశారు.