- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ఒక పార్టీ టికెట్పై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం అనైతికం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ముఠాగోపాల్ అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. కడియం శ్రీహరి నమ్మించి గొంతు కోశారని, ఆయనకు కేసీఆర్ అన్ని రకాల పదవులు ఇచ్చారని, ఆయన బిడ్డకు కూడా టికెట్ ఇచ్చారని, ఇంతకంటే ఎక్కువేం చేస్తారని ప్రశ్నించారు. కడియం చేసిన పనికి ప్రజలు ఛీఛీ అంటున్నారని వ్యాఖ్యానించారు.
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటని, అన్నం తినేవాళ్లెవరూ ఇలాంటి పనులు చేయరని దుయ్యబట్టారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని కౌశిక్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన దానం నాగేందర్పై స్పీకర్కు ఫిర్యాదు చేసి రెండు వారాలవుతున్నా రెస్పాండ్ లేదన్నారు. అందుకే మరోసారి పిటిషిన్ ఇచ్చేందుకు, పార్టీ మారినట్టు మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు స్పీకర్ ఆఫీసుకు వెళ్తే ఆయన కలవలేదని కౌశిక్ తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ కూడా తమను కలవకుండా అవాయిడ్ చేశారని ఆరోపించారు. దానంపై స్పీకర్ యాక్షన్ తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లే వారందరికీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పే సమాధానం అని కౌశిక్రెడ్డి వ్యాఖ్యానించారు.