నిబద్ధతతో పనిచేసే వారినే ఎన్నుకోవాలి :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

నిబద్ధతతో పనిచేసే వారినే ఎన్నుకోవాలి :  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చండూరు (గట్టుప్పల్), మునుగోడు, వెలుగు : ప్రజా సమస్యలు పరిష్కరించే నిబద్ధత కలిగిన నాయకుడిని గ్రామ సర్పంచ్ , ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలిపించుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆదివారం గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామంలో ఆయన పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల మీదుగా వెళ్తున్న11 కేవీ కరెంట్ లైన్లను తొలగించాలని, లూజు వైర్లను సరిచేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

తమకు ఇండ్లు రాలేదని కొందరు ఎమ్మెల్యే దృష్టికి చెప్పడంతో అర్హులైన నిరుపేదలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వారు ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేయాలని స్థానిక నాయకులకు సూచించారు. గుడిసెలో జీవిస్తున్న రాములు ఇంటికి వెళ్లి పరిశీలించారు. రాములుకు ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే రూ.5 లక్షలతోపాటు ఇల్లు పూర్తి కావడానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం అంతంపేట నుంచి నామాపురం వరకు, దేవులతండా, రాజ్యతండాకు కొత్తగా నిర్మిస్తున్నరోడ్డును పరిశీలించారు. అంతకుముంద మునుగోడు పట్టణంలోని కమ్మగూడెంలోని మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్ ను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని టీచర్లకు సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నామని జగన్నాథం, నాయకులు రామదాస్ శ్రీనివాస్, కంచుకట్ల సంపత్, వీరమల్ల శ్రీశైలం, రావుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.