పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తాం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తాం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: పాలకుర్తి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించి పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు. శుక్రవారం తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో 111 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో 56 మంది లబ్ధిదారులకు రూ.26 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. అంతకుముందు తొర్రూరు మండలంలోని చింతలపెల్లి, మాటేడు, పోలేపల్లి, మడిపల్లి, కంటాయపాలెం, అమ్మాపురం, జమస్తానపురం, గుర్తూరు, ఖానాపురం, చీకటాయపాలెం గ్రామాల్లో సీఆర్ఆర్ నిధుల నుంచి సుమారు రూ.కోటి 50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.

 అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపిన అవుతాపురానికి చెందిన గద్దల రమ్యశ్రీని ఎమ్మెల్యే, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణాధ్యక్షుడు సోమ రాజశేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.