బీఆర్ఎస్ చచ్చిన పాము.. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు : యశస్విని రెడ్డి

బీఆర్ఎస్ చచ్చిన పాము.. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు :  యశస్విని రెడ్డి

పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే  బీఆర్ఎస్  ఉనికి కోల్పోయిందన్నారు. ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని.. అది చచ్చిన పామని విమర్శించారు.  ఏప్రిల్ 18వ తేదీ గురువారం వరంగల్ లో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, యశస్వినీ రెడ్డి, నాయిని రాజేందర్, వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య పాల్గొన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఆరూరి రమేష్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా వస్తున్నాడని అలాంటి వ్యక్తి మనకు అవసరమా అని యశస్విని రెడ్డి ప్రశ్నించారు.  గత పదేళ్లు అయన వర్దన్నపేటలో ఏం చేశాడో మనందరికీ తెలుసన్నారు.   బీజేపీకి మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప ఇంకోటి రాదని విమర్శించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని.. అందుకు ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తను కాంగ్రెస్ గుర్తిస్తుందని తెలిపారు.  వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.  
.