
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కొత్త కుట్రకు తెరలేపాడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. టీఎస్ను టీజీగా మార్చడంపై పింక్ మీడియాలో అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాటికి నెలకు మూడు లక్షలు ఇస్తున్నారని ఆరోపించారు. టీజీగా మార్చినందుకు వేలకోట్లు ఖర్చు అవుతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
దీని వెనక కేటీఆర్ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ఇంట్లో కూర్చొని ఆయన ఇదంతా చేస్తున్నారని అన్నారు. గతంలోనే క్రిశాంక్ ఫేక్ జీవోలు తయారు చేసి జైల్లోకి పోయిండని తెలిపారు. తప్పుడు జీవో కాపీలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీలు ఇచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
టీజీగా మార్చినేందుకు రూ.4630 కోట్లు ఖర్చు అవుతుందని ప్రచారం చేస్తున్నారని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. డీజీపీ వద్ద తేల్చుకుందాం రావాలని సూచించారు. సీఎం రేవంత్ వచ్చాక పదేండ్లు గడీల పాలనకు స్వస్తి పలికి ప్రజా పాలన తెచ్చామన్నారు. ఏసీలకు అలవాటు పడ్డ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. ఏదైనా బాధ్యత గల జర్నలిస్టులు తప్పులు ఉంటే హెచ్చరించాలన్నారు.