మల్లాపూర్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఓడించినా.. గెలిపించినా నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తనదే అని ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఏసీలో కూర్చొని షోప్టాప్ చేసే వ్యక్తిని కాదని, రైతు బిడ్డగా రైతాంగ సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లే ఆఫ్ పేరుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి రైతులను ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహంతోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవితను రైతులు ఓడించారని, దీంతో అర్వింద్కు అదృష్టం కలిసి వచ్చిందన్నారు.
ఆయన ఐదేండ్ల నుంచి పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నిజామాబాద్ నుంచి జగిత్యాల వరకు గోదావరి నదిపై నాలుగు లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి కారణం తానేనని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ నియోజకవర్గం పులివెందులతో పోటీగా జగిత్యాలను అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో గంగనాల ప్రాజెక్ట్కు ఎనిమిదేండ్ల కింద శంకుస్థాపన చేసిన బీఆర్ఎస్ సర్కార్ తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందుతుందన్నారు. తాను గెలిచిన ఆరు నెలల్లోనే గంగనాల ప్రాజెక్ట్ను పూర్తి చేసి సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కాంగ్రెస్ డెలిగేట్ సభ్యుడు సుజిత్రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జలపతిరెడ్డి, ఎంపీటీసీలు శ్రీనివాస్రెడ్డి, సత్తెమ్మ, మంజుల, శ్రీనివాస్ పాల్గొన్నారు.