తెలంగాణ జాతిపితకు నోటీసులిస్తరా?.. కేసీఆర్​ మీద ఈగ వాలినా ఊరుకోం: కవిత

తెలంగాణ జాతిపితకు నోటీసులిస్తరా?..  కేసీఆర్​ మీద ఈగ వాలినా ఊరుకోం: కవిత
  • ఆ బక్కమనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది
  • నోటీసులకు నిరసనగా ఈ నెల 4న మహాధర్నా
  • కేసీఆర్​కు ఓ కన్ను బీఆర్ఎస్​.. మరో కన్ను జాగృతి
  • సీఎం రేవంత్​ ఇప్పటికీ జై తెలంగాణ అని అనరు
  • యువ వికాసానికి రాజీవ్​ పేరు ఎందుకని ప్రశ్న
  • తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని, ఆయనకు నోటీసులు ఇవ్వడమంటే యావత్​ తెలంగాణకు ఇవ్వడమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కేసీఆర్ మీద ఈగ వాలినా ఊరుకోబోమని హెచ్చరించారు. అసలు కేసీఆర్​కు నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ‘‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చినందుకా? రైతుబంధు, రైతుబీమా ఇచ్చినందుకా?’’ అని నిల దీశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఏటా 20 లక్షల ఎకరాలకుపైగా సాగునీటిని కేసీఆర్​ ఇవ్వడం చూసి  కాంగ్రెస్​ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని, అందుకే నోటీసులు ఇచ్చిందని అన్నారు. అసలు అది కాళేశ్వరం కమిషనా? లేదంటే కాంగ్రెస్​ కమిషనా? అని ప్రశ్నించారు. కేసీఆర్​కు నోటీసులిచ్చినందుకు రాష్ట్రంలోని ప్రతి బిడ్డా బాధపడుతున్నారని పేర్కొన్నారు. శనివారం  బంజారాహిల్స్​ నందినగర్​లోని తన ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​కు నోటీసులిచ్చినందుకు నిరసనగా జూన్ 4న జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్​ వద్ద మహాధర్నా చేస్తామని చెప్పారు. మహాధర్నా పోస్టర్​ను రిలీజ్​ చేశారు. 

‘‘ఆ బక్కపలచటి మనిషి (కేసీఆర్) పిడికిలెత్తి పోరాడితేనే తెలంగాణ వచ్చిం ది. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టే ఇప్పుడు మీరు సీఎం కుర్చీలో కూర్చున్నరు. అది మరచిపోయి కేసీఆర్​కే నోటీసులిస్తరా? అసలు కాళేశ్వరం కమిషన్​ ఏంది.. దాని కుట్రలేంది అన్నది ఈ నెల 4న ధర్నాలో వివరిస్తాం. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును వాడకుండా.. రైతులను ఎండబెడుతున్నారు. కాంట్రాక్టర్లకు వంతపాడుతున్నారు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

ప్రజల గొంతుకగా పనిచేస్తున్నం..

తెలంగాణ జాగృతి 2006 నుంచి ప్రజల గొంతు కగా పనిచేస్తున్నదని కవిత చెప్పారు. జయశంకర్, కేసీఆర్​ స్ఫూర్తితోనే జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్​కు ఒక కన్ను బీఆర్ఎస్​, మరో కన్ను జాగృతిలాగా పనిచేస్తామని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక అంశాలనూ ప్రజలకు వివరించేలా జాగృతి తరఫున ఉద్యమంలో పోరాడామని గుర్తుచేశారు. కేసీఆర్​ పదేండ్ల పాలనకు, ప్రస్తుత పాలనకు చాలా తేడా ఉందని కవిత చెప్పారు. సీఎం రేవంత్​ రెడ్డి కనీసం ‘జై తెలంగాణ’ అనరని పేర్కొన్నారు. ఇప్పటికైనా ‘జై తెలంగాణ’ అని అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్​ చేశారు. 

లేదంటే సీఎం కుర్చీలో కూర్చునే హక్కు రేవంత్​కు లేదన్నారు. ‘‘జూన్ 2న రాజీవ్ యువ వికాసం స్కీమ్ తెస్తామంటున్నారు. తెలంగాణ పథకాలకు రాజీవ్​ పేరు ఎందుకు? తెలంగాణతో సంబంధం ఉన్నవాళ్ల పేరు పెట్టాలి. శ్రీకాంత చారి, యాదిరెడ్డి, కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్​ బాపూజీ, దొడ్డి కొమరయ్య వంటి వాళ్ల పేర్లు పెట్టాలి. లేదంటే మీ కాంగ్రెస్​ పార్టీ నాయకుడైన పీవీ నర్సింహారావు పేరైనా పెట్టాలి’’ అని ఆమె డిమాండ్​ చేశారు. పొరుగు రాష్ట్రం నీటిని తరలించుకుపోతున్నా సీఎం రేవంత్​ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. 

నదుల అనుసంధానం పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల రిజర్వాయర్​ కడుతున్నా సీఎం రేవంత్​ ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. నదుల అనుసంధానంపై నాడు కేంద్రం ఒత్తిడి తెస్తే.. తుపాకులగూడెం బ్యారేజీ నుంచి నీళ్లు తీస్కపోవాలని కేసీఆర్​ తేల్చి చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం ఒప్పుకోకుండా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కడతామని చెప్పిందన్నారు. కానీ, ఇప్పుడు రివర్​ లింకింగ్​ పాయింట్​ పోలవరానికి తీసుకెళ్లారని, పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని తరలించబోతున్నారని ఆరోపించారు. చెన్నైకి తాగునీటి తరలింపు పేరిట తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తరలించుకుపోయే కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. సీఎం దీనిపై వెంటనే మాట్లాడాలన్నారు. 

బీసీ బిల్లును డీప్​ ఫ్రిజ్​లో పెట్టే ప్రయత్నం

బీసీ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు డీప్​ ఫ్రిజ్​లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని కవిత ఆరోపించారు. అదే చేస్తే జాగృతి తరఫున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని, కేంద్రానికి సెగ తగిలేలా రైల్​ రోకోలూ చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీతో భేటీలో రేవంత్​ కనీసం బీసీ బిల్లు గురించి మాట్లాడలేదని అన్నారు. 

రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలపై పోరాడడం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేలోపు జాగృతి తరఫున పోరాడి బీసీ రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పారు. కాగా, జాగృతిలో జాగృతి విద్యార్థి విభాగం, ఎస్సీ, ఎస్టీ విభాగం, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్​ మైనారిటీ విభాగాలనూ ఏర్పాటు చేస్తున్నామని కవిత తెలిపారు.