
కేసీఆర్ కు బీఆర్ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్ల లాంటివన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ మీద ఈగ కూడా వాళనివ్వబోమని చెప్పారు. మే 31న బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ,జై జాగృతి అంటూ ప్రసంగం మొదలు పెట్టిన కవిత.. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులివ్వడానికి నిరసనగా జూన్ 4న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్న చేస్తామని చెప్పారు. కేసీఆర్ కు నోటీసులివ్వడమంటే..యావత్ తెలంగాణకు నోటీసులివ్వడమేనని చెప్పారు కవిత.
అది కాళేశ్వరం కమిషనా..?లేక కాంగ్రెస్ కమిషనా.? తెలంగాణకు జాతిపిత అయిన కేసీఆర్ కు నోటీసులిస్తే యావత్ తెలంగాణకు ఇచ్చినట్టే.కేసీఆర్ కు నోటీసులివ్వడానికి వ్యతిరేకంగా జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేస్తాం. కేసీఆర్ కు బీఆర్ఎస్,జాగృతి రెండు కళ్ల లాంటివి. కేసీఆర్ మీద ఈగ వాళినా ఊరుకోం. మేం పనిచేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. జాగృతిని మరింత విస్తరిస్తాం.
ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి భాగమైంది. 18 ఏళ్ల క్రితం జాగృతి సంస్థను ప్రారంభించాం. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి పుట్టింది. మేం ఉద్యమాలు చేసిన నిమిషాల్లోనే ప్రభుత్వాల నుంచి జీవోలు వచ్చాయి. యూఎస్ నుంచి వచ్చాక జయశంకర్ మార్గనిర్దేశం చేశారు. జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ జై తెలంగాణ అని అనాలి. జూన్2న రాష్ట్ర ఆవిర్భావం రోజునాడైనా రేవంత్ అమరులకు నివాళి అర్పించాలి. రాజీవ్ యువ వికాసానికి ఆయన పేరు ఎందుకు పెట్టారు..తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.
ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నా రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. గోదారి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించాలి లేకపోతే రైల్ రోకో వంటి కార్యక్రమాలు చేపడుతాం అని కవిత అన్నారు.