దేశ సాహిత్యం యువత చేతుల్లో భద్రంగా ఉంది: ‌ఎమ్మెల్సీ కవిత

దేశ సాహిత్యం యువత చేతుల్లో భద్రంగా ఉంది: ‌ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ: సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల కలాన్ని పదును పెట్టి సమాజాన్ని ఐక్యంగా ఉంచేలా కృషి చేయాలని కవులు, రచయితలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ దేశంలో సమాజాన్ని విడదీసే వాతావరణాన్ని మనం చూస్తున్నామని, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈ దేశంలో సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి సాహిత్యకారులు కృషి చేయాలని కోరారు. ఇవాళ న్యూఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో కవిత మాట్లాడారు.  

సాహిత్య రంగానికి విశేష సేవలు చేసిన వారికి వచ్చే ఏడాది నుంచి భారత్ జాగృతి ఫౌండేషన్,ఇండియా టుడే సంస్థ సంయుక్తంగా సాహ్యిత పురస్కారాన్ని అందిస్తాయని కవిత ప్రకటించారు. “సాహిత్యం జ్ఞానాన్ని ఇస్తుందటారు. సాహిత్యం జ్ఞానాన్ని ఇవ్వాలి అదే సమయంలో సమాజంలో మంచి వాతావరణాన్ని సృష్టించేలా ఉండాలి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా దేశంలో మంచి వాతావరణం కల్పించే బాధ్యత కవులు, రచయితలపై ఉంటుంది. సాహిత్యకారులను ప్రోత్సహించడానికి, వారికి అండగా ఉండడానికి అవార్డును నెలకొల్పాం”  అని వ్యాఖ్యానించారు. 

ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా కవులు, రచయితలు దేశం పట్ల మరింత బాధ్యతతో రచనలు చేస్తారని కవిత అభిప్రాయపడ్డారు. దేశంలో సమాజాన్ని విడగొట్టడానికి, మనస్సులను దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి నెలకొందని, కాబట్టి కలానికి పదును పెట్టాలని కవులు, రచయితలకు పిలుపునిచ్చారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే కవులు సమాజాన్ని కలిపేందుకు కృషి చేయాలన్నారు. ఆ కృషికి భారత్ జాగృతి ఫౌండేషన్, ఇండియా టుడేతో పాటు తామంతా అండగా నిలబడుతామని, కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. సాహిత్యకారులను సన్మానించుకుంటే సమాజపు గౌరవం పెరుగుతుందని చెప్పారు.

యువతకు సాహిత్యం అర్థంకాదని.. భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి రావడం లేదని కొంత మంది అంటారు, కానీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొనడం గర్వంగా ఉందని కవిత పేర్కొన్నారు. దేశ సాహిత్యం భారత యువత చేతుల్లో భద్రంగా ఉందని భావిస్తున్నానని ఆమె తెలియజేశారు. సాహిత్య  ప్రేమికురాలిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. శబ్దమే శక్తి అని తాను బలంగా విశ్వసిస్తానన్నారు. ఒక శబ్దం లక్షలాది హృదయాలను కదిలిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు.