ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి మార్చి 21న ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయంలో సోమవారం (మార్చి 20న) విచారణకు హాజరైన కవితను.. దాదాపు 10గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాతఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. విజయ చిహ్నం చూపుతూ తన కారులో బయల్దేరారు.
సోమవారం ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు కవితను పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ అంశంలో కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు కవిత విచారణ కొనసాగుతుండగానే.. తెలంగాణ అదనపు ఏజీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 10 గంటల పాటు విచారణ అనంతరం రాత్రి 9 గంటల తర్వాత కవిత విచారణను ముగించారు.
సోమవారం సుదీర్ఘంగా కవితను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మరోసారి విచారణకు రావాలని సూచించారు. మంగళవారం ఉదయం 11గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కవితకు చెప్పినట్టు సమాచారం.
ఢిల్లీ మద్యం కేసులో కవితకు ఈడీ ముందుగా మార్చి 8వ తేదీన నోటీసులు జారీ చేసింది. 9న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది. దీంతో 11న వస్తానన్న కవిత.. తాను చెప్పిన తేదీ ప్రకారమే ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా.. అప్పుడు అధికారులు దాదాపు 8గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
ఈనెల 16వ తేదీన మరోసారి విచారణకు రావాలని 11వ తేదీనే మళ్లీ ఈడీ సమన్లు ఇవ్వగా.. మార్చి 15న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 24న విచారణకు రావాల్సి ఉన్న క్రమంలో అప్పటివరకు వేచి చూడాలని ఈడీని కోరుతూ లేఖ రాశారు. గత విచారణలో అధికారులు కోరిన సమాచారాన్ని తన తరఫు న్యాయవాది భరత్తో పంపారు. అదే రోజు ఈడీ అధికారులు ఈ నెల 20న తమ ఎదుట విచారణకు రావాలని నోటీసులు పంపగా.. కవిత సోమవారం (మార్చి 20న) విచారణకు హాజరయ్యారు.