
హసన్ పర్తి, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదవితే బంగారు భవిష్యత్ ఉంటుందని సంగీత దర్శకుడు, పద్మశ్రీ ఎం.ఎం.కీరవాణి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్ లోని ఎస్సార్ యూనివర్సిటీలో శుక్రవారం తృతీయ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎం.ఎం.కీరవాణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎయిరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు, ఎయిరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జి.సతీశ్ రెడ్డి, ఎస్సార్ విద్యాసంస్ధల చైర్మన్ వరదారెడ్డి హాజరయ్యారు.
కీరవాణి మాట్లాడుతూ ఎస్సార్ యూలో జరిగే స్నాతకోత్సవానికి రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం సతీశ్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇంజినీర్లు, ఆవిష్కర్తలు, సమస్యల పరిష్కారం చూపి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. అనంతరం తెలుగు సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ ఎం.ఎం.కీరవాణికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్టర్ అర్చనారెడ్డి, ప్రొ, ఛాన్సలర్ మధుకర్ రెడ్డి, ప్రొ, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.