గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి

గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి

గత రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి గుజరాత్‌కు గర్వకారణంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత 8 సంవత్సరాలలో సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రాన్ని అనుసరిస్తూ తమ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. రెండు నెలల్లో ఇప్పటికే నాలుగు సార్లు గుజరాత్ లో పర్యటించిన నరేంద్ర మోడీ.. తాజాగా శుక్రవారం (జూన్ 10న ) కూడా పర్యటించారు. ఈ సందర్భంగా గుజరాత్ లో రూ.3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

నవ్ సారిలో పర్యటించిన ప్రధాని మోడీ.. ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలుగా పని చేసినందుకు గర్వంగా ఉందని, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ అన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టామన్నారు. 

తాను గుజరాత్ ను విడిచిపెట్టిన తర్వాత, ఆ బాధ్యతను స్వీకరించిన భూపేంద్ర భాయ్, సీఆర్ పాటిల్ ఉత్సాహంతో ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగించినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్నారు. తాజాగా చేపట్టిన ప్రాజెక్టులు సూరత్, తాపి, నవ్ సారి, వల్సాద్ తో సహా దక్షిణ గుజరాత్ లోని కోట్లాది మంది ప్రజల జీవితాలను అభివృద్ధి పథంలో నడిపిస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య.. ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.