
నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సిరాజ్ మేనియాతో ఊగిపోయింది. మేడిన్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ తన సొంత గడ్డపై తొలి వన్డే ఆడాడు. ఈ వన్డేలో మహ్మద్ సిరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 2017లో టీమిండియాకు ఎంపికైన 26 ఏళ్ల సిరాజ్..హైదరాబాద్ వన్డేకు ముందు వరకు మూడు ఫార్మాట్లు కలిపి 41మ్యాచ్లు ఆడాడు. అయితే సొంతగడ్డపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటానికి అతనికి ఆరేళ్లు పట్టి్ంది. ఎట్టకేలకు భాగ్యనగరంలో తొలి మ్యాచ్ ఆడిన సిరాజ్..అద్భుతంగా రాణించాడు. భారీ స్కోరు నమోదైన మ్యాచ్లో టీమిండియా విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.
ఫస్ట్ వన్డేలో టీమిండియా 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీతో చేయగా..టార్గెట్ ఛేజింగ్లో మైఖెల్ బ్రెస్వేల్ 78 బంతుల్లోనే 140 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపులో మహ్మద్ సిరాజ్ ముఖ్యపాత్ర పోషించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ను ఆరంభంలోనే సిరాజ్ దెబ్బతీశాడు. డెవాన్ కాన్వే(10)ను పెవీలియన్ చేర్చాడు. చివర్లో భారత్ ఓడిపోతుందనుకున్న సమయంలో టీమిండియాకు సిరాజ్ ఆపద్భాంధవుడయ్యాడు. కివీస్ విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం అయ్యాయి. అటు వైపు బ్రేస్వెల్, శాంట్నర్ పరుగుల వరద పారిస్తున్నారు. ఈ సమయంలో బౌలింగ్ కు వచ్చిన సిరాజ్..క్రీజులో కుదురుకున్న శాంట్నర్ను ఔట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే షిప్లేను బౌల్డ్ చేసి...భారత్ కు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు.
హైదరాబాద్లో తన సొంత ప్రేక్షకుల సమక్షంలో తొలి వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్ 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అందులో 2 మెయిడిన్లు ఉన్నాయి. ఇక సిరాజ్ ఈ మ్యాచ్ అతని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆడటం మరో విశేషం. తల్లితో పాటు కుటుంబ సభ్యులు ఈ వన్డే వీక్షించారు.