సీఎం ఆదేశాలతోనే మొహర్రం ర్యాలీ

సీఎం ఆదేశాలతోనే మొహర్రం ర్యాలీ

హిందూ పండుగలు మాత్రం చేసుకోనివట్లేదు..

కేసీఆర్ పై బండి సంజయ్‌ ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘రాష్ట్ర ప్రభుత్వానికి పాతబస్తీలో మొహర్రం ర్యాలీ కనిపించలేదా? కేసీఆర్ సెక్యులరిజం ఇదేనా?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. డబిర్ పురలో మొహర్రం ర్యాలీని ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. పాతబస్తీలో మొహర్రం ర్యాలీ సీఎం ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించారు. సోమవారం జూమ్ యాప్ ద్వారా మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఎంఐఎం పార్టీ చేతిలో సీఎం కీలుబొమ్మలా మారారని ఆరోపించారు. మొహర్రంపై కాంగ్రెస్, -కమ్యూనిస్టు పార్టీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ర్యాలీ నిర్వహించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా మైనార్టీలు రోడ్లపై తిరగడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయన్నారు.

కేసీఆర్ నిజ హిందుత్వం బయటవడ్డది

‘హిందూ సమాజాన్ని కేసీఆర్ బొందుగాళ్లను చేశారు. ఆయన నిజమైన హిందుత్వం ఏంటో బయటపడింది’ అని సంజయ్ అన్నారు. సీఎం వల్ల హిందూ సమాజం ఇబ్బంది పడుతోందని.. అభిమానం, భక్తి, సెంటిమెంట్ను కాదని గణేశ్ మండపాలు పెట్టుకోకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ధైర్యంగా మండపాలు ఏర్పాటు చేసిన వాళ్లపై పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కరోనాను అడ్డుపెట్టుకొని బోనాలు,- ఉగాది,- శ్రీరామ నవమి, గణేశ్ పండుగ చేసుకోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్కు హిందువుల ఓట్లు వద్దా?

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం కొమ్ము కాస్తోందని సంజయ్ విమర్శించారు. హోం మంత్రిపై ఎంఐఎం దాడి చేస్తే కనీసం ఖండించే ధైర్యం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్కు రానున్న రోజుల్లో హిందువుల ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. బ్రిటిష్ పాలకులను తరిమికొట్టినట్లు మళ్లీ హిందువులు ఏకం కావాల్సిన టైమ్ వచ్చిందన్నారు.

సంచార జాతుల దినోత్సవ శుభాకాంక్షలు

సంచార జాతుల సోదరులకు బండి సంజయ్ సంచార జాతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితంగా 1952 ఆగస్టు 31న సంచార జాతుల్ని విముక్త జాతులుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అందుకే ఆ రోజును సంచార జాతుల ప్రజలు ప్రత్యేక రోజుగా, నిజమైన స్వాతంత్ర్యంగా పరిగణిస్తారని పేర్కొన్నారు.