మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నేడు డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించేలా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ లో రాష్ట్ర సర్కారు పిటిషన్ వేయనుంది. ఈ కేసుపై సీబీఐ విచారణ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరనుంది.
సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీలో ఏముంది ?
మొయినాబాద్ ఫాం హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వగా.. బుధవారం రోజున ఆ తీర్పు కాపీ సీబీఐకి అందింది. దీంతో హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుకాపీలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కాపీ ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని జడ్జి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు.
ఇక ఈ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో డిస్మిస్ అయింది. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జీవో 63 ద్వారా ఏర్పాటుచేసిన సిట్ ను రద్దు చేసింది. ఎఫ్ ఐ ఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేసి.. సిట్ చేసిన దర్యాప్తును రద్దు చేసింది.