మంత్రి కేటీఆర్‌కు మోతె సర్పంచ్ భర్త ట్వీట్

మంత్రి కేటీఆర్‌కు మోతె సర్పంచ్ భర్త  ట్వీట్

జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్ కు మోతే సర్పంచ్ స్వప్న భర్త రాజేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. జిల్లాలోని మోతె, ధరూర్, తిప్పన్నపేట్, నర్సింగాపూర్, తిమ్మాపూర్, హుస్నాబాద్, అంబారిపేట్ లలో మాస్టర్ ప్లాన్ ను క్యా్న్సిల్ చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే విషయంపై ఆయా గ్రామాల్లో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంబారిపేట్, హస్నాబాద్ గ్రామాల్లో తమ భూములను మాస్టర్​ప్లాన్​నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా అంబారిపేట్ లో పలువురు రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. తర్వాత ఛలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. 

దీంతో అంబారీపేట్, హస్నాబాద్ గ్రామాల్లోని బాధితులు ట్రాక్టర్లు, బైక్ లపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా కొత్త బస్టాండ్ కు చేరుకుని బైఠాయించారు. కొద్దిసేపటి తర్వాత కలెక్టరేట్ కు చేరుకున్నారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ రవిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు డిమాండ్​చేయడంతో ఆయన లేరని, ఒప్పుకుంటే ఐదుగురిని మాత్రమే ​అడ్మినిస్ట్రేషన్​ ఆఫీసర్​(ఏఓ)ను కలవడానికి పర్మిషన్​  ఇస్తామని చెప్పారు. దీంతో ఐదుగురు వెళ్లి ఏఓ చరణ్​కు  వినతిపత్రం ఇచ్చి వచ్చారు. మరో వైపు జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామ పంచాయతీలో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని తీర్మానం చేసి జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ లో తీర్మాన పత్రాన్ని అందజేశారు.