
- మతి స్థిమితం లేని కుటుంబ పెద్దతో సంతకాలు
- మాజీ సర్పంచ్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపణ
పెద్దపల్లి, వెలుగు: మతి స్థిమితం లేని తమ కుటుంబపెద్దతో సంతకాలు చేయించుకొని భూమిని అక్రమంగా మాజీ సర్పంచ్పట్టా చేయించుకున్నాడని తల్లి కొడుకు ఆరోపించారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద పురుగుల మందు డబ్బా పట్టుకుని ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన ప్రకారం.. పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రాజు శంకరయ్యకు భార్య సుశీల, కొడుకు సతీశ్ ఉన్నారు. కొంతకాలం కింద శంకరయ్య రోడ్డు ప్రమాదానికి గురికాగా.. మతిస్థిమితం కోల్పోయాడు.
అనంతరం కోలుకుని ఇంటిని వదిలిపెట్టి బయట తిరుగుతుండగా ఎవరో ఒకరు తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించేవారు. అతని పేరిట ఉన్న 4. 28 ఎకరాల భూమిని రాఘవపూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. ఇదేవిధంగా గతంలోనూ శంకరయ్య ఇతరులకు భూమిని అమ్మేందుకు యత్నించగా.. కొనుగోలు, అమ్మకాలు చేయకుండా కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసి భూమిని బ్లాక్ లిస్టులో పెట్టించినట్లు తెలిపారు.
తన రాజకీయ పలుకుబడితో వెంకటేశం బ్లాక్ లిస్టులోని భూమి పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదే విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా తీసుకోలేదని వాపోయారు. తమకు అధికారులు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ లోనే ఆత్మహత్యకు పాల్పడతామన్నారు. అలాగే మాజీ సర్పంచ్ నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి అతనిపై తీసుకోవాలని తల్లి కొడుకు కోరారు.