కొడుకు మరణాన్ని తట్టుకోలేక బావిలో దూకి తల్లి ఆత్మహత్య

కొడుకు మరణాన్ని తట్టుకోలేక బావిలో దూకి తల్లి ఆత్మహత్య

బెల్లంపల్లి రూరల్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కొడుకు మృతిని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. రెండు నెలలుగా బాధపడుతూ చివరికి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట నియోజకవర్గంలోని మోదెలు గ్రామానికి చెందిన మల్లీశ్వరి(50) కొడుకు సాయికృష్ణ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి మల్లీశ్వరి కొడుకును తలుచుకుంటూ కుమిలిపోతోంది. 

ఎప్పుడూ సాయికృష్ణనే కలవరిస్తోంది. మంగళవారం సాయంత్రం దేవాపూర్​లో ఉండే పెద్ద కూతురు శాతరాశి శైలజ ఇంటికి భర్త చంద్రయ్యతో కలిసి వచ్చింది. అంతాకలిసి రాత్రి భోజనం చేసి పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరూ లేవకముందు మల్లీశ్వరి బయటకు వచ్చి అక్కడి బావిలో దూకింది. శబ్ధం రావడంతో కుటుంబ సభ్యులు  ఆమెను బావిలోనుంచి బయటకు తీశారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.