హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పిల్లల్లో కుమారుడు చనిపోయాడు. కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఆస్పత్రికి తరలించారు. హృదయ విదారక ఘటనతో బోరబండలో విషాద ఛాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లోని బోరబండ పీఎస్ పరిధిలోని పెద్దమ్మ నగర్ లో శనివారం(మార్చి14) ఈ దారుణం జరిగింది. పెద్దమ్మనగర్ కు చెందిన సత్యవాణి అనే మహిళ ఆమె ఇద్దరు పిల్లలు ఐదేళ్ల రుద్రాన్ష్, రెండేళ్ల కుమార్తె తన్విక గొంతు నులిమి తాను ఫ్యాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో కుమారుడు రుద్రాన్స్ అక్కడికక్కడే చనిపోగా, కుమార్తె తన్విక ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా జరుగుతున్న కుటుంబ కలహాలతో విసుగెత్తిపోయి సత్యవాణి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
