ముద్దుల బిడ్డను చంపి.. తాను ఉరేసుకున్న తల్లి.. వీళ్లను చూస్తుంటే గుండె పిండేస్తోంది..

ముద్దుల బిడ్డను చంపి.. తాను ఉరేసుకున్న తల్లి.. వీళ్లను చూస్తుంటే గుండె పిండేస్తోంది..

హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ మహిళ తన పది నెలల కుమారుడికి విషం ఇచ్చి అనంతరం తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు, మనువడి మరణాన్ని చూసి తట్టుకోలేక మహిళా తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌కు చెందిన సుష్మ (27)కు నాలుగు సంవత్సరాల క్రితం యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. యశ్వంత్ రెడ్డి వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ (CA). వీరికి యశ్వవర్ధన్ రెడ్డి (10 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సుష్మ తల్లి లలిత (44) ఫంక్షన్ షాపింగ్ కోసం ఇటీవల కూతురు ఇంటికి వచ్చింది. 

కుటుంబ కలహాలతో మానసిక ఒత్తిడిలో ఉన్న సుష్మ గురువారం (జనవరి 8) తల్లి ఇంట్లో ఉండగానే  మరో రూమ్‎లో తన కుమారుడికి విషమిచ్చి ఆ తర్వాత తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో కూతురు, మనువడిని విగతజీవులుగా చూసి తట్టుకోలేక సుష్మ తల్లి లలిత కూడా పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రాత్రి సుమారు 9:30 గంటలకు ఇంటికి వచ్చిన యశ్వంత్ రెడ్డి తలుపులు మూసి ఉండటంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అప్పటికే భార్య, కొడుకు మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. 

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణపాయ స్థితిలో ఉన్న లలితను ఆసుపత్రికి తరలించారు. సుష్మ, బాలుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. సుష్మ ఆత్మహత్యకు కుటుంబ కలహాలేనా మరేదేమైనా కారణం ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఓ వైపు కూతురు, మనువడు మరణించడం.. మరోవైపు అమ్మమ్మ ప్రాణపాయ స్థితిలో ఉండటంతో సుష్మ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెలుబద్దలయ్యేలా రోదిస్తున్నారు సుష్మ కుటుంబ సభ్యులు, బంధువులు.