ఎంపీ అన్న కనీస గౌరవం లేకుండా నాపై దాడి

ఎంపీ అన్న కనీస గౌరవం లేకుండా నాపై దాడి
  • పోలీసులపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎంపీ బండి సంజయ్
  • ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్ర ఘటన ఫొటోలు, వీడియోలు అందజేత

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా తనకు ఉన్న హక్కులకు పోలీసులు భంగం కలిగించారంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అన్న కనీస గౌరవం కూడా లేకుండా తనపై పోలీసులు దురుసుగా దాడి చేశారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. కరీనంగర్ ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్రలో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని స్పీకర్ కు వివరించారాయన. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందజేసి, వాటిని పరిశీలించాల్సిందిగా కోరారు బండి సంజయ్.

పార్లమెంటు సభ్యుడనైన తన హక్కులకు  పోలీసులు భంగం కలిగించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ చార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, ఇన్స్పెక్టర్ అంజయ్య పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్పీకర్ ను కలిసిన సమయంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి కామర్స్ బాలసుబ్రమణ్యం కూడా ఉన్నారు.