బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బుధవారం కరీంనగర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి, కోవిడ్ చికిత్స ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా టెస్టులు పెంచడం వల్ల కరోనా రోగులను గుర్తించడం సులభతరమవుతుందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు అధికం అవుతున్నాయని..ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. కరోనాపై తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యులను సంప్రదించాలన్నారు
కరోనా బాధితుల పట్ల వివక్ష చూపడం మానుకోవాలని.. కిరాయి ఇళ్లలో ఉంటున్న వారికి పాజిటివ్ వస్తే ఓనర్లు వారిని ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. ఎవరి ఇంట్లో వారు ఉంటే ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలియజేశారు. ప్రభుత్వం మాట్లాడితే ప్రయివేటు మెడికల్ కళాశాలలు కూడా కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వ వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై భారం పడకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రయివేటు డాక్టర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలని,సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
కోవిడ్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 31 వేల 464 కోట్ల నిధులు తెలంగాణకు విడుదల చేసిందన్నారు బండి సంజయ్. 7.44 లక్షల ఎన్.95 మాస్కులు, 3.41 లక్షల పీపీఈ కిట్లు, 22 లక్షల 50 వేల హైడ్రోక్లోరో క్వీన్ టాబ్లెట్లు, 3 లక్షల టెస్టింగ్ కిట్లు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చాయన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్రం కలిసి రాజకీయ విమర్శలకు పోకుండా ప్రజలను కాపాడుకోవాలన్నారు.