కేటీఆర్‌‌ను సీఎం చేస్తే సర్కార్‌ కూలుతది

కేటీఆర్‌‌ను సీఎం చేస్తే సర్కార్‌ కూలుతది

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది: ఎంపీ బండి సంజయ్
అందుకే కేసీఆర్ వెనక్కి తగ్గారని వ్యాఖ్య

న్యూఢిల్లీ, వెలుగు: కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే, మంత్రులెవరూ సహకరించరని, ప్రభుత్వం కూలుతుందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, తాను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రెస్ మీట్‌లో చెప్పారన్నారు. శుక్రవారం పార్లమెంటులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో ధర్మపురి అర్వింద్‌తో కలిసి మీడియా‌తో ఆయన మాట్లాడారు. “ఎంత సేపు కొడుకు సీఎం, తండ్రి పీఎం అన్న తపనే తప్పా, రాష్ట్ర అభివృద్ధిపై కేసీఆర్‌కు ఏ మాత్రం ఆలోచన లేదు. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి, మతం కోణంతో విద్వేషాలు రెచ్చగొడితే సహించేది లేదు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ కట్టుబడి ఉంది. అమలు చేయని
పథకాలను, అమలులో ఉన్నట్లు కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారు” అని ఆరోపించారు.

సీఏఏపై బాధంతా విపక్షాలదే..
సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (సీఏఏ)ను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు సీఏఏకు వ్యతిరేకమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సీఏఏ విషయంలో దేశంలో ఏదో జరుగుతోందని చిత్రీకరిస్తున్న కేసీఆర్.. రాష్ట్రంలో ఏదో జరగాలనే మూర్ఖపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు, సీఎం కేసీఆర్ ముస్లింలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. సీఏఏపై బాధపడుతోంది ముస్లింలు కాదని, ఆ
బాధంత విపక్షాలదేనని ఎద్దేవా చేశారు. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లతో అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రవాదులకు పౌరసత్వాన్ని టీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటుందా అని ప్రశ్నించారు. బైంసా ఘటనను గల్లీ లొల్లిగా
అభివర్ణించిన కేసీఆర్‌కు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన కూడా రాష్ట్ర సర్కార్‌కు రాలేదన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు బీజేపీ అంటేనే భయపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అందువల్లే మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల కోసం మోడీ సర్కార్ తీసుకువచ్చిన అనేక పథకాలను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.