ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు మునుపే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఐపీసీ 451, 504, 505 (1)(b), 505 (1)(C), 506, 153-B (1)(C) సెక్షన్ల కింద కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ఈ క్రమంలోనే తెల్లవారుజామున దామో జిల్లా హట్టాలోని తన నివాసం నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా పొవై రెస్ట్ హౌస్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసిన సెక్టార్ అధ్యక్షుల సమావేశంలో పటేరియా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నేత పటేరియా పలు కామెంట్స్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండండంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా... రాజా పటేరియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు పటేకర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. తాజాగా ఆయనను అరెస్టు చేశారు.