
- దిశ మీటింగ్ లో పాలమూరు ఎంపీ డీకే అరుణ
నారాయణపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని పాలమూరు ఎంపీ, దిశ కమిటీ చైర్ పర్సన్ డీకే అరుణ ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ది, సమన్వయ మరియు పర్య వేక్షణ కమిటీ(దిశ) సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సమావేశంలో సమీక్షించారు. 46 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జిల్లా అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతోందని, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు అవగాహన కల్పించి మహిళలు స్క్రీనింగ్ చేసుకునేలా చూడాలన్నారు. ధన్వాడ మండలంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సూచించారు. పీఎంశ్రీ కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీని తనకు పంపించాలని డీఈఓను ఆదేశించారు. మక్తల్ లో రాత్రిపూట ఇసుక అక్రమ రవాణాపై గనుల శాఖ అధికారిపై అసహనం వ్యక్తం చేశారు.
మక్తల్ పట్టణంలోని ట్యాంక్ బండ్ పై హోటల్, టాయిలెట్ బ్లాక్, ఇతర దుకాణాల నిర్మాణానికి ప్రతిపాదించడం పై మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి, డీఏవో జాన్ సుధాకర్, డీపీవో సుధాకర్ రెడ్డి, డీఎంహెచ్వో జయ చంద్రమోహన్, డీఎఫ్వో అరవింద్, ఆర్డీవో రామచంద్రనాయక్, జడ్పీ సీఈవో శైలేశ్ కుమార్, దిశ కమిటీ సభ్యులు లక్ష్మీశ్యాంసుందర్ గౌడ్, పాండు నాయక్, కిరణ్, పడాకుల శ్రీనివాసులు, బలరాం రెడ్డి పాల్గొన్నారు.