న్యూఢిల్లీ, వెలుగు: తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుని టీవీ సీరియల్లా కొనసాగిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే కేసీఆర్కు నోటీసులన్నారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటు తర్వాత జరిగే ఎలక్షన్స్లో కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లిస్తుందన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ తదితర అనేక స్కామ్లు, కుంభకోణాలు జరిగినా నిందితులను శిక్షించేందుకు కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మరోవైపు, దేశంలో అనేక రంగాల అభివృద్ధి దిశగా కేంద్ర బడ్జెట్ ఉందని లక్ష్మణ్ అన్నారు.
