రాహుల్ గాంధీ కాంగ్రెస్కు పట్టిన పీడ అని వాళ్లే అంటుర్రు: బండి సంజయ్

రాహుల్ గాంధీ కాంగ్రెస్కు పట్టిన పీడ అని వాళ్లే అంటుర్రు: బండి సంజయ్

ఓబీసీ సమాజాన్ని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ వర్గాలను కించపర్చారని మండిపడ్డారు. గాంధీ ఫ్యామిలీ మాత్రమే దేశాన్ని పాలించాలని కాంగ్రెస్ అనుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులను కూడా కాంగ్రెస్ నేతలు అవమాన పరుస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై  దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 6 నుంచి 14 వరకు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. 

 రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్న..

ఓబీసీ సమాజాన్ని కించపర్చే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాహుల్గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలతో పాటు..ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు ఎంపీనయ్యానని రాహుల్ గాంధీ పార్లమెంట్ నే కించపర్చాడని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై రాహుల్ గాంధీకి నమ్మకం లేదని..కోర్టులు తీర్పులు వెలువరిస్తే మోడీకేమి సంబంధం అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన పీడ అని ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారని విమర్శించారు.  రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 

కేంద్రాన్ని బద్నాం చేయడమే కేసీఆర్, కేటీఆర్ పని..

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఎక్కడివి అని సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. రైతుల కోసం కేంద్రం నిధులు ఇస్తున్నా..వాటిని రైతుల కోసం ఖర్చు చేయకుండా కొన్ని నెలల పాటు దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో కేంద్రం వాటా ఉందని ఎందుకు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత ఎరువుల ప్రకటన ఏమైంది..? సబ్సిడీలు ఎందుకు ఎత్తేశారు అని సీఎం కేసీఆర్ ను నిలదీశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు కారణం ఎవరని ప్రశ్నించారు. ఎక్కడికెళ్లినా సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ కేంద్రాన్ని బద్నాం చేసేందుకు అసత్యాలు చెప్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.