
బషీర్బాగ్, వెలుగు: అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన కర్పూరీ ఠాకూర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం సంతోషకరమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అత్యంత వెనుకబడిన కులానికి చెందిన జన నాయక్ కర్పూరీ ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి సీఎం కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లో ఒక మలుపు అని పేర్కొన్నారు. కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం పట్ల హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్లో నాయీ బ్రాహ్మణులు నిర్వహించిన కృతజ్ఞతాభివందన సభలో లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.
దేశ సంపదను సృష్టించే శ్రమ జీవులను గత పాలకులు విస్మరించారని, కానీ ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి పని చేస్తుందని చెప్పారు. కర్పూరీ ఠాకూర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించిందన్నారు. ఠాకూర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన తండ్రి నాయీ బ్రహ్మణ వృత్తిని కొనసాగించారన్నారు. ఠాకూర్ సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆయన ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
దేశం కోసం అద్వానీది రాజీలేని పోరాటం
బీజేపీ ముఖ్య నేత ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన జీవితమంతా దేశం కోసం రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తికి మోదీ ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం గర్వకారణమన్నారు. దేశ భక్తి, జాతీయ భావం, విలువలతో కూడిన రాజకీయలు చేసిన మహోన్నత వ్యక్తి అద్వానీ అని పేర్కొన్నారు. ఈ అవార్డు ఆయనకు రావడం నేటి తరానికి, యువతకు స్ఫూర్తి అని వెల్లడించారు.