గీత దాటొద్దు .. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు మల్లు రవి వార్నింగ్

గీత దాటొద్దు .. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు మల్లు రవి వార్నింగ్
  • అభిప్రాయాలను నాలుగు గోడల మధ్య చెప్పాలని సూచన 
  • పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్​గా బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ నాయకులు పార్టీ గీత దాటొద్దని, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను నాలుగు గోడల మధ్యే చెప్పాలని సూచించారు. పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్​గా చిన్నారెడ్డి నుంచి మల్లు రవి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న రవికి ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

 అక్కడి నుంచి గాంధీ భవన్​కు ర్యాలీగా చేరుకున్నారు. ఐఏసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్​ను కలిసి మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందని, అయితే నేతలు నాలుగు గోడల మధ్యే అభిప్రాయాలను చెప్పాలన్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని.. లక్ష్మణ రేఖను దాటొద్దన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మల్లు రవి ధన్యవాదాలు తెలిపారు. 

కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వంశీ కృష్ణ, వీర్లపల్లి శంకర్, రాజేశ్ రెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుంది

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ సర్కారు  దోచుకుందని మల్లు రవి ఆరోపించారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలను నెరవెర్చేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.