
ముషీరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్ బీసీ భవన్ లో నీల వెంకటేశ్, రాజేందర్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన 14 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఫైరయ్యారు. ఒకవైపు రిజర్వేషన్లు పెంచుతామని, మరోవైపు పార్టీపరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారన్నారు. పార్టీ పరంగా టికెట్లు తమకు అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై బీసీలు ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.12 నెలల కింద జరగాల్సిన ఎన్నికలు బీసీ రిజర్వేషన్లు అంశంపై వాయిదా మీద వాయిదా వేస్తూ జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీలో చట్టం చేసినా ఇప్పటివరకు రిజర్వేజన్ల అమలు కాలేదని, రాష్ట్రానికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు పెంచే అధికారం ఉన్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి కేంద్రంపై నెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. అలాగే ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జి.అనంతయ్య, రామ్మూర్తి, మోదీ రాందేవ్, మణికంఠ, నిమ్మల వీరన్న పాల్గొన్నారు.