- 45 రోజుల కింద ఇంట్లో పనికి చేరిన నేపాలీ దంపతులు
- కనిపించకపోవడంతో వారిపైనే పోలీసుల అనుమానం
జూబ్లీహిల్స్, వెలుగు: ఇంట్లోని లాకర్లలో దాచిన రూ.2 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీ చేశారు. ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్నంబర్25లోని ఫ్లాట్నంబర్305లో వ్యాపారవేత్త అనిరుధ్రెడ్డి, దీపికా రెడ్డి దంపతులు నివసిస్తున్నారు. 45 రోజుల కింద నేపాలీ వ్యక్తులు మహేశ్షాహి, అప్సర షాహి దంపతులను ఇంటి పనుల కోసం నియమించుకున్నారు. వారం రోజుల కింద అనిరుధ్ రెడ్డి వ్యాపార పనుల మీద తమిళనాడులోని ఊటీకి వెళ్లగా.. గత శుక్రవారం దీపికా రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు.
శనివారం ఉదయం మహేశ్షాహి, అప్సర షాహి కనిపించకపోవడంతో పక్కింటివారు అనిరుధ్ రెడ్డికి ఫోన్చేసి చెప్పారు. ఆయన వెంటనే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 29లో నివసిస్తున్న తన స్నేహితుడు రోహిత్ మెహతాకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. తన ఫ్లాట్కు వెళ్లాలని కోరారు. రోహిత్ మెహతా వెళ్లి చూడగా.. లోపల లాకర్లు పగిలిపోయి కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్కు చేరుకొని పరిశీలించారు.
అనిరుధ్రెడ్డిని ఫోన్లో ఆరా తీయగా.. లాకర్లలో రూ.2 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉంచామని తెలిపారు. అవి మాయమవడం, అదే సమయంలో ఇంట్లో పని చేసే మహేశ్ షాహి, అప్సర షాహి కనిపించకపోవడంతో పోలీసులు వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ మెహతా ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్ని వెల్లడించారు.
