- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీ సంస్కృతి దేశానికే గర్వాకరణమని కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. ఆదివాసీల ఆరాధ్య దైవం, గోండీ ధర్మగురువు హీరాసుక్కా బాబా జయంతి సందర్భంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకమని, ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయం చేసిందన్నారు.
పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆదివాసీల విశిష్టతను తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. జల్, జంగల్, జమీన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆదివాసీలతో కలిసి సంప్రదాయా నృత్యం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన హీరాసుక్క జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.
