ధైర్యం ఉంటే కవిత ప్రెస్మీట్ పెట్టి మాట్లాడాలి: రఘునందన్ రావు

ధైర్యం ఉంటే కవిత ప్రెస్మీట్ పెట్టి మాట్లాడాలి: రఘునందన్ రావు
  •  చచ్చిన పార్టీకి ప్రాణం పోసేందుకే డ్రామా
  • కేటీఆర్, కవిత, హరీశ్ చెల్లని రూపాయలు
  • కవితపై పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తున్నదెవరు?
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనేది తప్పుడు ప్రచారం
  • బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే పంచాది ఇది
  • కవితకు ధైర్యముంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలె
  • మీ కుటుంబ పంచాదిలోకి బీజేపీని లాగొద్దు
  •  బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని, దానికి ప్రాణం పోసేందుకు కల్వకుంట్ల ఫ్యామిలీ నాటకమాడుతోందని  బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కేటీఆర్, కవిత బీఆర్ఎస్ రీ బ్రాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత, హరీశ్ చెల్లని రూపాయలన్నారు. ఇవాళ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదని  అన్నారు. 

 బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనే తప్పడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనపైనా వ్యక్తిగతంగా బురద చల్లుతున్నారని అన్నారు. కవితపై పెయిడ్ ఆర్టికల్స్ రాయిస్తున్నది గుర్తించి బయటపెట్టాలని సీఎంను కోరుతున్నట్టు రఘునందన్ రావు  చెప్పారు. కేసీఆర్ కుటుంబం పదేండ్లు తెలంగాణను దోచుకున్నదని అన్నారు.   కవిత రెండు స్టేట్ మెంట్లు ఇస్తూ కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. ఒక సారి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరిగాయనీ, మరోసారి కేసీఆరే తమ నాయకుడని అంటున్నారన్నారు.  బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ చెత్త పంచాయితీ ముందుకు తెచ్చారని చెప్పారు.  బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసేందుకు చర్చలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. 

కవిత చిట్ చాట్ లు కాకుండా ధైర్యం ఉంటే ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పారు. కుటుంబ పంచాయితీని వాళ్లే తేల్చుకోవాలని అన్నారు. హరీశ్ రావు  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో తన కుమార్తె ఆస్పత్రిని ప్రారంభించారని, ఆ కార్యక్రమానికి మంత్రి తలసానితోపాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా వచ్చారని అన్నారు. ఆయన బీజేపీ కోవర్టయితే మంత్రి వర్గం నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు.  బీఆర్ఎస్ కు జనం గుండెల్లో స్థానం లేదని, జాగా కోసం అన్నా, చెల్లె కొట్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ బలహీన పడాలనుకునే వాళ్లే కవిత వెనుక ఉన్నారని చెప్పారు. కవిత పార్టీ పెడుతుందనే సమాచారం తనకు ఉందన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న పంచాయితే తెలంగాణ వరకూ వచ్చిందని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి అన్నారు.