సాగర్ బైఎలక్షన్ ప్రచారానికి రేవంత్ రెడ్డి

సాగర్ బైఎలక్షన్ ప్రచారానికి రేవంత్ రెడ్డి

నాగార్జునసాగర్ ఉపఎన్నిక దగ్గరపడుతోంది. రాష్ట్ర ప్రజల చూపంతా సాగర్ ఉపఎన్నిక మీదే ఉంది. ఏ పార్టీ గెలుస్తుందా? అని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాంతో పార్టీలన్నీ తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు తమ ప్రచారంలో దూకుడుపెంచుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థి నోముల భగత్ గెలుపుకోసం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను రంగంలోకి దించింది. దుబ్బాకలో గెలిచి, జీహెచ్ఎంసీలో సత్తాచాటిన బీజేపీ.. సాగర్‌లో కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి, సీనియర్ లీడర్, సాగర్ నియోజకవర్గం నుంచి గతంలో ఏడుసార్లు గెలుపొందిన జానారెడ్డిని గెలిపించుకొని.. తమ క్యాడర్‌ను కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో శుక్రవారం నుంచి ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం రేవంత్.. నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. దానికంటే ముందుగా రేవంత్.. సాగర్‌లో సూసైడ్ చేసుకొని చనిపోయిన ప్రైవేట్ టీచర్ రవి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.