కేసీఆర్ బిడ్డ రాజ్యమేలితే... యాదవుల బిడ్డలు గొర్రెలు కాసుకోవాలా అని ఎంపీ రేవంత్ రెడ్డి కేసీఆర్ను ప్రశ్నించారు. సాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆయన పలు మండలాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఏనాడు అంబేద్కర్కు నివాళి అర్పించలేదు. అదే మాయ మాటలతో సాగర్ ప్రజలను మోసం చేయడానికి వచ్చాడు. నాగార్జునసాగర్కు జానారెడ్డి ఏం చేశారని కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్.. ఓ సారి తండాల్లోకి రా... జానారెడ్డి ఏం చేశాడో తెలుస్తుంది. రాష్ట్రంలో నిజాయితీ నాయకుడు ఏవరంటే టీఆర్ఎస్ నాయకులు కూడా జానారెడ్డి పేరు చెబుతారు. యాదవులకు మొదటి విడత గొర్రెలు ఇంకా పంపిణీ చేయలేదు. కేసీఆర్ బిడ్డ రాజ్యమేలితే.. యాదవుల బిడ్డలు గొర్రెలు కాసుకోవాలా? నెల్లికల్ లిప్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం దగ్గర 72 కోట్ల రూపాయలు లేవా? బడుగు, బలహీన, దళిత,గిరిజన, మైనార్టీలనూ కేసీఆర్ అవమానపరుస్తున్నారు. నోముల కమ్యూనిస్టు పార్టీలో ఉంటే అనేక సమస్యలపై పోరాటం చేశారు. నోముల టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన గొంతు మూగబోయింది. రైతుబంధు ఇవ్వకపోతే, ఫించన్లు తీస్తే టీఆర్ఎస్ నాయకులను తరిమికొడ్తం’ అని ఎంపీ రేవంత్ అన్నారు.