హైదరాబాద్, వెలుగు: పార్టీ మారుతున్నామంటూ తమపై కొన్ని రోజులుగా దుష్ప్రచారం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నానని పేర్కొంటూ ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఏఐసీసీ, స్క్రీనింగ్ కమిటీ, పీసీసీ ఆమోదంతో తాను హుజూర్నగర్, తన భార్య పద్మావతి కోదాడ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామని ఆయన తెలిపారు.
30 ఏండ్లుగా అధికార, ప్రతిపక్షాల్లో ఉన్నానని.. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ప్రజల కోసమే పనిచేశానన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నిండాలని తపించానన్నారు. తమ జీవితం హుజూర్నగర్, కోదాడ ప్రజల జీవితాలకే అంకితమని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, ప్రేమ, ఆప్యాయతలు తమపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.