Mrunal Thakur: నా ఫొటోలు, వీడియోలతో ఆటలు వద్దు.. AI డీప్‌ఫేక్‌లపై మృణాల్ సీరియస్ వార్నింగ్

Mrunal Thakur: నా ఫొటోలు, వీడియోలతో ఆటలు వద్దు.. AI డీప్‌ఫేక్‌లపై మృణాల్ సీరియస్ వార్నింగ్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోల బెడద కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సినీ హీరోలు, హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని వారి ముఖాలను మార్ఫింగ్ చేస్తూ నకిలీ కంటెంట్‌ను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఈ సమస్య సౌత్ ఇండియన్ టాప్ నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)ను కూడా వెంటాడింది.

తన ఫొటోలు, ముఖచిత్రాన్ని ఉపయోగించి AIతో రూపొందించిన డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మృణాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విడుదల చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

‘‘నా డీప్‌ఫేక్‌ ఫొటోలను, వీడియోలను క్రియేట్‌ చేసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీన్ని తక్షణమే నిలిపివేయండి. ఇకపై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని స్పష్టం చేసింది మృణాల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

సెలబ్రిటీలను వెంటాడుతున్న AI డీప్‌ఫేక్‌లు:

కేవలం మృణాల్ ఠాకూర్ మాత్రమే కాకుండా, ఇటీవలి కాలంలో టెక్నాలజీ దుర్వినియోగం వల్ల అనేకమంది ప్రముఖులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకే నేషనల్ క్రష్ రష్మిక మందన్న, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లతో పాటు సల్మాన్ ఖాన్, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి వంటి ప్రముఖ నటీనటులు కూడా డీప్‌ఫేక్ బారిన పడి పోలీసులను, కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

►ALSO READ | ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడిన మాటల్లోని డబుల్ మీనింగ్ ఇదా..!

నెటిజన్ల రియాక్షన్:

మృణాల్ ఠాకూర్ తాజా హెచ్చరికపై నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. టెక్నాలజీని మంచికోసం మాత్రమే ఉపయోగించాలని, ఇలాంటి అనవసరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ క్రియేషన్ కోసం ఏఐని వాడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడుతున్నారు. సెలబ్రిటీల పట్ల ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

'రాకా' తో మృణాల్ ఠాకూర్!

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 2026లో ఆమె నటించిన 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్, పూజా హెగ్డేలతో కలిసి ఆమె నటించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం మంచి ఆదరణ పొందింది. అలాగే తెలుగులో అడివి శేష్ సరసన 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' (Dacoit: A Love Story) చిత్రంలో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' మూవీతో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.