
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, వరల్డ్ కప్ విజేత మహేంద్ర సింగ్ ధోనికి మరో అరుదైన ఘనత దక్కింది. భారత్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనికి ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు లభించింది. సోమవారం (జూన్ 9) లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చిన వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. మొత్తం ఏడుగురుని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చింది. ఇందులో కెప్టెన్ కూల్ ఒకరు. దీంతో ఇండియా తరుఫున ఈ ఘనత సాధించిన 11వ క్రికెటర్గా ధోని రికార్డులకెక్కాడు.
ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్పై తమదైన ముద్ర వేసిన మరో ఆరుగురు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కించుకున్నారు. ఇందులో ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, స్టార్ బ్యాటర్ హషీం అమ్లా, న్యూజిలాండ్ ప్లేయర్ డానియల్ వెటోరీ, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్, పాక్ మహిళ క్రికెటర్ సనా మీర్ ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు.
11వ భారతీయుడు
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న 11వ భారతీయుడుగా ధోని రికార్డ్ సృష్టించారు. ధోని కంటే ముందు 10 మంది భారత క్రికెటర్ల మాత్రం ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నారు. ఇందులో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే వంటి వారి ఉన్నారు. తాజాగా ధోని వారి సరసన చేరాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఆడుతున్నాడు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కడంపై ధోని స్పందించాడు. ‘‘తరతరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల సహకారాన్ని గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కడం గౌరవంగా ఉంది.. ఆల్ టైమ్ గ్రేట్స్ జాబితాలో పాటు నా పేరు ఉండటం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే విషయం’’ అని ధోని కృతజ్ఞతలు తెలిపాడు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్ల జాబితా:
1. బిషన్ బేడి 2009
2 కపిల్ దేవ్ 2009
3 సునీల్ గవాస్కర్ 2009
4 అనిల్ కుంబ్లే 2015
5 రాహుల్ ద్రవిడ్ 2018
6 సచిన్ టెండూల్కర్ 2019
7 వినూ మన్కడ్ 2021
8 డయానా ఎడుల్జీ 2023
9 వీరేంద్ర సెహ్వాగ్ 2023
10 నీతు డేవిడ్ 2023
11 ఎంఎస్ ధోని 2025