- కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యం
- ఇప్పటికే చాలాసార్లు వాయిదా
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో సర్వేలైన్స్ యూనిట్(ఎంఎస్యూ) కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఆలస్యమవుతోంది. ఇన్ ఫెక్షన్ డిసీజ్ లను ముందే గుర్తించి, నియంత్రించేందుకు ఇది కీలకంగా పని చేస్తుంది. ఈ ల్యాబ్ ను నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేస్తుండగా.. కమాండ్ కంట్రోల్ రూమ్ ను హరిహర కళాభవన్ లో సెట్చేస్తున్నారు.
కంట్రోల్రూమ్ను వానాకాలంలోపు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించడంతోపాటు జీహెచ్ఎంసీకి నిధులు కూడా ఇచ్చింది. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో రూ.1.40 కోట్లతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ, పనులు ఇంకా పూర్తి కాలేదు. రెండు నెలల క్రితమే పూర్తి చేసి జీహెచ్ఎంసీకి అప్పగించాల్సిన కాంట్రాక్టర్నిర్లక్ష్యం వహిస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆలస్యమవుతున్నది.
వర్షాకాలం ప్రారంభమైనా..
ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనందున అంటువ్యాధుల వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మెట్రో సర్వేలైన్స్ యూనిట్ వ్యాధుల ఉధృతిని ముందుగా గుర్తించి, సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆలస్యమవుతున్నది.
సెంటర్ ప్రారంభానికి హెల్త్ విభాగం అధికారులు ఇప్పటికే పలు ముహూర్తాలు పెట్టినా పనులు పూర్తి కాక వాయిదాలు వేస్తున్నారను. తాజాగా గతనెల 28న కూడా సెంటర్ ప్రారంభమవుతుందని ఉన్నతాధికారులు ప్రకటించారు. అంతేగాకుండా కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు కూడా పనులు పూర్తయ్యాయని తప్పుదోవ పట్టించారు.
ఏం చేస్తారు?
సిటీలో ఎక్కడైనా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసినా..లేదా అనుమానం వచ్చిన ప్రాంతాల్లో ర్యాండమ్ గా శ్యాంపిల్స్ సేకరిస్తారు. దీని కోసం ఇప్పటికే 17 శాఖలకు సంబంధించి 23 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వీరు హరిహర కళాభవన్ వద్ద నిర్మించనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేస్తారు.
దోమల ద్వారా వ్యాపించే (వెక్టర్ బోర్న్)వ్యాధులు, జంతువుల నుంచి మనుషులకు సోకే (జూనోటిక్) వ్యాధులు, వాటర్, ఎయిర్, ఫుడ్ పాయిజన్కు సంబంధించి రక్తం, నీళ్లు, గాలి, సాయిల్(భూసార) శాంపిల్స్సేకరిస్తారు. వాటిని ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ కు తీసుకువస్తారు. శ్యాంపిల్ ఏ రకమో..ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న డేటా ఎంట్రీ చేసి టెస్టు కోసం నారాయణగూడలోని ఐపీఎంకి పంపిస్తారు. ఎంఎస్ యూకి సంబంధించిన ఆఫీసు వర్క్ అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది.
