ఈ నెల 30న హైదరాబాదులోని పాతబస్తీ డబీర్ పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపుకు అనుమతించేలా పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయాలని ఇవాళ(బుధవారం) తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఊరేగింపుకు తాము అనుమతిని ఇవ్వలేమని చెప్పింది. మొహర్రం ఊరేగింపుకు సంబంధించి నిన్ననే సుప్రీంకోర్టు ఒక పిటిషన్ ను నిరాకరించిందని… అందువల్ల తాము కూడా పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అదే విధంగా కరోనా వ్యాప్తి క్రమంలో కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఊరేగింపులపై నిషేధం కొనసాగుతోందని చెప్పింది.
మొహర్రం అంబారి ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫాతిమా సేవాదళ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫున కౌన్సిల్ పాండురంగారావు వాదనలు వినిపించారు. ఊరేగింపు కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను సొంత ఖర్చులతో తెప్పించుకుంటారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
