- రిలయన్స్ షేర్లు ర్యాలీ చేస్తుండడమే కారణం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత రెండు సెషన్లలో 5.4 శాతం ర్యాలీ చేయడంతో ముకేశ్ అంబానీ సంపద 100 బిలియన్ డాలర్ల మార్క్ను క్రాస్ చేసింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం, ముకేశ్ అంబానీ సంపద 105.1 బిలియన్ డాలర్ల (రూ.8.7 లక్షల కోట్ల) కు పెరిగింది. గ్లోబల్ రిచ్లిస్ట్లో అంబానీ 11 వ ప్లేస్లో ఉన్నారు. ఫోర్బ్స్ రిచ్ లిస్ట్లో కేవలం 12 మంది ధనవంతుల సంపద మాత్రమే 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం రూ.2,725 దగ్గర కొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేశాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18 లక్షల కోట్లు దాటింది. కిందటేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరైన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు కూడా గురువారం 4.7 శాతం పెరిగి రూ.252 లెవెల్కు చేరుకున్నాయి. ఇతర అంబానీ కంపెనీల్లో నెట్వర్క్ 18 గత వారం రోజుల్లో 45 శాతం పెరగగా, టీవీ18 బ్రాడ్కాస్ట్ షేర్లు 24 శాతం లాభపడ్డాయి. ముకేశ్ అంబానీ 2021 లో 100 బిలియన్ డాలర్ల క్లబ్లో జాయిన్ అయ్యారు.
ఆ తర్వాత లిస్ట్లో చోటు కోల్పోయారు. మరోవైపు అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ గ్లోబల్ రిచ్లిస్ట్లో 16 వ ప్లేస్లో (79.9 బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు. టెస్లా బాస్ ఎలన్ మస్క్, ఫ్రెంచ్ బిజినెస్ మ్యాన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ జెఫ్ బెజోస్, ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తర్వాత ప్లేస్లలో ఉన్నారు.