న్యూఢిల్లీ : అప్పులతో ఇబ్బంది పడుతున్న స్పైస్జెట్ రూ.1,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ముంబైకి చెందిన హరిహర మహాపాత్రో, ప్రీతి మహాపాత్రో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయనున్నారు. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం, ఈ కపుల్స్ మహాపాత్రో యూనివర్సల్ లిమిటెడ్లో ప్రమోటర్లుగా ఉన్నారు. గో ఫస్ట్ను కొనుగోలు చేయడానికి స్పైస్జెట్ తాజాగా ఆసక్తి చూపించిన విషయం తెలిసిందే. గో ఫస్ట్ ప్రస్తుతం దివాలా చట్టం కింద రిజల్యూషన్ ప్రాసెస్లో ఉంది. ‘ గో ఫస్ట్ను కొనుగోలు చేయడానికి రిజల్యూషన్ ప్రొఫెషనల్ వద్ద స్పైస్జెట్ ఆసక్తి చూపించింది
అని ఈ ఎయిర్లైన్ కంపెనీ వెల్లడించింది. గో ఫస్ట్ విమానాలు ఈ ఏడాది మే నుంచి ఎగరడం లేదు. ప్రాట్ అండ్ విట్నీ నుంచి కొన్న ఇంజిన్లలో సమస్యలు తలెత్తాయని, అందుకే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని గో ఫస్ట్ గతంలో ప్రకటించింది. రూ. 2,240 కోట్లను సేకరించేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపిందని స్పైస్జెట్ సీఎండీ అజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఈక్విటీ షేర్లను ఇష్యూ చేయడం ద్వారా ఫారిన్ ఇన్వెస్టర్లు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ నుంచి ఈ ఫండ్స్ సేకరిస్తామన్నారు. ఎలరా ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, ఏరియస్ ఆపర్చునిటీస్ ఫండ్, మహాపాత్రో గ్రూప్, నెక్సస్ గ్లోబల్ ఫండ్, ప్రభుదాస్ లీలధర్, రిజోనెన్స్ ఆపర్చునిటీస్ ఫండ్, మరికొంత మంది ఇన్వెస్టర్లు స్పైస్జెట్లో ఇన్వెస్ట్ చేయనున్నారు.